

శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్) సెప్టెంబరు 1, 2026 నుంచి మారనుంది. విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ సంస్థ (ఏఈఆర్ఏ) ఆమోదించిన కొత్త టారిఫ్ ప్రకారం 2031 మార్చి 31 వరకు ఈ ఛార్జీలు అమల్లో ఉంటాయి. కొత్త విధానంలో విమానాశ్రయం నుంచి బయలుదేరే దేశీయ ప్రయాణికుల యూడీఎఫ్ రూ.750 నుంచి రూ.515కు, అంతర్జాతీయ ప్రయాణికుల రుసుము రూ.1,500 నుంచి రూ.1,030కి తగ్గుతుంది. అదే సమయంలో విమానాశ్రయంలో దిగే ప్రయాణికులపై తొలిసారిగా యూడీఎఫ్ విధించనున్నారు. దేశీయ ప్రయాణికులకు రూ.220, అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.440గా రుసుము నిర్ణయించారు. ఈ ఫీజు విమాన టికెట్లోనే కలిపి వసూలు చేస్తారు.
ఐదేళ్ల కాలంలో యూడీఎఫ్ను ఏటా సవరించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నార్తర్న్ రన్వే, నార్తర్న్ ప్రిసింక్ట్ అభివృద్ధి పూర్తయిన తర్వాత అదనపు ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కొత్త టెర్మినల్ ద్వారా ఏటా మరో రెండు కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉండగా, దిల్లీ విమానాశ్రయంలో ఫెడెక్స్ సుమారు రూ.1,430 కోట్ల పెట్టుబడితో ఎయిర్ కార్గో హబ్ను ఏర్పాటు చేయనుంది. 2.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 12-18 నెలల్లో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు సమక్షంలో దీనికి శంకుస్థాపన జరిగింది. ఈ కేంద్రం ద్వారా ప్యాకేజీల ప్రాసెసింగ్ సామర్థ్యం గంటకు 600 నుంచి 5,000కు పెరగనుంది. దేశంలో ఎయిర్ ఫ్రైట్ స్టేషన్లకు ప్రత్యేక విధానం తీసుకొస్తామని మంత్రి ప్రకటించగా, 2030 నాటికి దేశ వార్షిక ఎయిర్ కార్గో రవాణాను కోటి టన్నులకు పెంచే లక్ష్యాన్ని అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!