

దశాబ్దాలుగా కరవుతో అల్లాడుతున్న ప్రాంతాలకు భారీ ఊరట కలిగించే వెలిగొండ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. ఆగస్టు 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు ప్రాంతాలకు సాగు, తాగునీటి భరోసా కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో కీలక పనులు పూర్తయ్యాయి. జంట సొరంగాల ద్వారా కృష్ణా వరద జలాలను నల్లమలసాగర్ జలాశయానికి తరలిస్తున్నారు. తొలిదశలో 10.70 టీఎంసీల నీటిని జలాశయంలో నిల్వ చేసి 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు.
వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కిలోమీటర్ల పొడవైన జంట సొరంగాలు, వాటి నుంచి నల్లమలసాగర్కు నీటిని తరలించే 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువ నిర్మాణం పూర్తయింది. నల్లమలసాగర్లో 53.85 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. అక్కడి నుంచి తీగలేరు, గొట్టిపడియ, తూర్పు ప్రధాన కాలువల ద్వారా 4,47,300 ఎకరాలకు గ్రావిటీ ఆధారంగా నీటిని సరఫరా చేయనున్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 3,36,100 ఎకరాలు, నెల్లూరులో 84 వేల ఎకరాలు, కడపలో 27,200 ఎకరాలకు సాగునీరు అందనుంది. రెండు దశలు పూర్తయితే ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో సుమారు 24 లక్షల మందికి తాగునీరు అందించే అవకాశం ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం రూ.10,200 కోట్లు కాగా, ఇప్పటివరకు సుమారు రూ.7,983 కోట్లు ఖర్చు చేసినట్లు వివరాలు చెబుతున్నాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!