

భారత్-న్యూజిలాండ్ మధ్య సముద్ర, రక్షణ సహకారాన్ని మరింత విస్తరించేందుకు కీలక చర్చలు జరిగాయి. భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ ఇటీవల న్యూజిలాండ్లో పర్యటించారు. ఆక్లాండ్లో న్యూజిలాండ్ నౌకాదళ అధిపతి రియర్ అడ్మిరల్ గారిన్ గోల్డింగ్తో సమావేశమైన ఆయన.. ఇరు దేశాల నౌకాదళాల మధ్య కార్యాచరణ సంబంధాలు, సముద్ర సమాచార మార్పిడి, శిక్షణ, వృత్తిపరమైన పరస్పర సహకారాన్ని మరింత పెంచే అంశాలపై చర్చించారు.
ఇరు దేశాల మధ్య 2027లో తొలి ద్వైపాక్షిక నావికా విన్యాసం నిర్వహించే అంశంపైనా నౌకాదళ అధిపతులు చర్చించారు. ఈ సందర్భంగా అడ్మిరల్ కృష్ణస్వామినాథన్కు న్యూజిలాండ్ సంప్రదాయ మావోరీ స్వాగతం పలికింది. అనంతరం న్యూజిలాండ్ నౌకాదళ సిబ్బంది గౌరవ వందనం నిర్వహించారు. భారత్-న్యూజిలాండ్ మధ్య ఇప్పటికే ఉన్న సముద్ర భద్రతా సహకార వ్యవస్థ ఆధారంగా భవిష్యత్ నౌకాదళ సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!