

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికాతో గతంలో కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని సమర్థించారు. ఈ ఒప్పందంలో ఇరాన్ లొంగిపోయేలా చేసే నిబంధన ఒక్కటీ లేదని ఆయన స్పష్టం చేశారు. సుప్రీం లీడర్ విధానాలను రూపొందిస్తారని, తాము ఆ మార్గాన్నే అనుసరిస్తామని తెలిపారు. జూన్లో కుదిరిన ఈ అవగాహనలో యుద్ధాన్ని 60 రోజుల్లో ముగించి, ఇరాన్ అణు కార్యక్రమంపై ఒప్పందం కుదుర్చుకునేలా చర్చలు జరపాలని నిర్దేశించారు. అయితే ఆ గడువు ముగిసినా కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో దేశంలో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందని పెజెష్కియాన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, జనవరిలో ఇరాన్లో జరిగిన నిరసనలకు సంబంధించి మజీద్ అదినే అనే వ్యక్తికి విధించిన మరణశిక్షను అమలు చేసినట్లు న్యాయవ్యవస్థకు చెందిన మీజాన్ వార్తా సంస్థ వెల్లడించింది. మరోవైపు, అమెరికాతో యుద్ధం తప్పదని ముందుగానే అంచనా వేసిన ఇరాన్ నాలుగు దశాబ్దాలుగా ఇందుకోసం సన్నద్ధమైందని భారత రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ఢిల్లాన్ తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో భారీ నష్టం జరిగినప్పటికీ ఇరాన్ ప్రతిఘటన సామర్థ్యాన్ని కొనసాగించిందని, దేశ అత్యున్నత నాయకత్వాన్ని కోల్పోయే పరిస్థితులకు కూడా ముందుగానే ప్రణాళికలు రూపొందించిందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!