

ఆడిట్ అవసరం లేని ఆదాయపు పన్ను చెల్లింపుదారులు జులై 31లోపు తమ ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయాల్సి ఉంది. గడువు ముగియడానికి మరో రోజే మిగిలి ఉండటంతో చివరి నిమిషంలో రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే సుమారు 30 లక్షల ఐటీఆర్లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. జులై 29 నాటికి మొత్తం 5.02 కోట్ల రిటర్నులు దాఖలుకాగా, వాటిలో 4.69 కోట్ల రిటర్నులు వెరిఫై అయ్యాయి. అలాగే 2.33 కోట్ల రిటర్నులు ప్రాసెస్ చేసినట్లు వెల్లడించింది.
గడువు దాటిన తర్వాత కూడా డిసెంబర్ 31 వరకు ఆలస్య రుసుము చెల్లించి ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం ఉంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్నవారు రూ.1,000, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పన్ను మినహాయింపు పరిమితిలోపు ఆదాయం ఉన్నవారికి ఈ రుసుము వర్తించదు. అయితే బకాయి పన్నుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేస్తే రీఫండ్ ఆలస్యం కావడంతో పాటు కొన్ని రకాల పన్ను ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత 60 రోజుల్లోపు ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లేదా డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయడం తప్పనిసరి. లేకపోతే దాఖలు చేసిన రిటర్ను చెల్లుబాటు కాదు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!