

దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మెగా ఐపీఓకు సిద్ధమైంది. రూ.22,562 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 17న ప్రారంభమై.. సెప్టెంబర్ 21న ముగియనుంది. ఒక్కో షేరుకు రూ.1,700–1,785 ధరల శ్రేణిని నిర్ణయించారు. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద రిటైల్ ఇన్వెస్టర్లు ఎనిమిది షేర్లతో కూడిన ఒక్కో లాట్కు రూ.14,280 చెల్లించాల్సి ఉంటుంది. 2026 జూన్ నాటికి ఎన్ఎస్ఈకి 13.24 కోట్ల యూనిక్ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లు ఉండగా, క్యాష్ మార్కెట్లో 93.05 శాతం వాటా, ఈక్విటీ ఫ్యూచర్స్లో 99.72 శాతం, ఈక్విటీ ఆప్షన్లలో 68.48 శాతం వాటా ఉంది. 2025-26లో కార్యకలాపాల ద్వారా రూ.1,601.31 కోట్ల ఆదాయం పొందిన ఎన్ఎస్ఈకి లావాదేవీ ఛార్జీలే ప్రధాన ఆదాయ వనరు.
అయితే ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని రిస్కులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఎస్ఈ ఆదాయంలో 78.65 శాతం లావాదేవీ ఛార్జీల నుంచే రావడంతో ట్రేడింగ్ పరిమాణం తగ్గితే ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆప్షన్స్ ద్వారా 60.22 శాతం, ఫ్యూచర్స్ ద్వారా 8.92 శాతం ఆదాయం రావడం వల్ల డెరివేటివ్స్పై ఆధారపడటం మరో సవాలు. టాప్-10 ట్రేడింగ్ సభ్యుల నుంచే 46.78 శాతం ఆదాయం రావడం, సెబీ, ఆర్బీఐ, ఐఎఫ్ఎస్సీఏ నియంత్రణ, సాంకేతిక అంతరాయాలు, సైబర్ దాడుల ముప్పు కూడా కీలక రిస్కులుగా ఉన్నాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.27,870 కోట్ల ఐపీఓ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద ఐపీఓగా ఎన్ఎస్ఈ ఇష్యూ నిలవనుంది. సెప్టెంబర్ 24న బీఎస్ఈలో ఎన్ఎస్ఈ షేర్లు లిస్ట్ కానున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!