

శాసనసభ సమావేశాలను ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) నిర్ణయించింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన సోమవారం అసెంబ్లీలోని బీఏసీ మందిరంలో జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ చీఫ్విప్ జీవీ ఆంజనేయులు, భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికను సభలో ప్రవేశపెట్టే అంశంపై చర్చ జరిగింది. మంగళవారం కేబినెట్లో నివేదికపై చర్చించిన అనంతరం సభలో ప్రవేశపెట్టడంపై నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ సమావేశాల్లో మొత్తం 9 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
శాసనమండలిలో మాత్రం సభా కార్యకలాపాలపై స్పష్టత రాలేదు. మండలి ఛైర్మన్ మోషేన్రాజు అధ్యక్షతన సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సాగునీరు, తాగునీటి సరఫరా, వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం, వైకాపా హయాంలో గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలు, మెగా డీఎస్సీ-2025 అంశాలపై చర్చించాలని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదించారు. అయితే ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మంగళవారమే డీఎస్సీపై చర్చించాలని పట్టుబట్టారు. ఇరు పక్షాలు తమ వైఖరిపై వెనక్కి తగ్గకపోవడంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. దీంతో మంగళవారం ప్రశ్నోత్తరాల అనంతరం మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించి సభా కార్యక్రమాలను ఖరారు చేయాలని నిర్ణయించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!