

కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం. ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలతో పాటు తాజాగా సురేఖ చేసిన వ్యాఖ్యలను కూడా అధిష్ఠానం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సురేఖపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేబినెట్ నుంచి తొలగించే అవకాశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఆమె హద్దులు దాటారని, కఠిన చర్యలు తప్పవని ఏఐసీసీకి చెందిన కీలక నేత ఒకరు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే సురేఖపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేలా కొందరు ముఖ్య నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
బుధవారం రోజంతా కాంగ్రెస్ పార్టీలో వరుస సమావేశాలు, సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది. గత రాత్రి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసి సమావేశమయ్యారు. అనంతరం ముగ్గురూ ఒకే కారులో రాజశేఖర్ రెడ్డి అవార్డు కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భట్టి విక్రమార్క ఖర్గే కారులోనే ఆయన నివాసానికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖర్గేతో విడిగా సమావేశమయ్యారు. అనంతరం మీనాక్షి నటరాజన్తోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం.
ఈ రోజు కూడా కాంగ్రెస్ నేతల మధ్య చర్చలు కొనసాగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. కేసీ వేణుగోపాల్ ఈ రోజు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కానున్నట్లు సమాచారం. మొత్తం పరిణామాలపై నివేదికను సిద్ధం చేసి రాహుల్ గాంధీకి వివరించనున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు, సమయాన్ని బట్టి సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ కూడా రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.
కొండా సురేఖపై చర్యలతో పాటు మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రుల పనితీరు, సమర్థత ఆధారంగా కేబినెట్ ప్రక్షాళనకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. కేబినెట్ మార్పులు, చేర్పులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, గవర్నర్ కోటా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం ఖర్గే, కేసీ వేణుగోపాల్తో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా, లేక సమావేశాల తర్వాత చేపడతారా అనే అంశంపై రాహుల్ గాంధీతో జరిగే సమావేశాల అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!