

తెలంగాణలో విస్తారంగా, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్ విజయ్ విహార్ వద్ద కృష్ణా నది తీరంలో సోమవారం బ్రహ్మముహూర్తంలో మహా వరుణ యాగం ప్రారంభమైంది. 108 మంది రుత్వికులు, వేద పండితులు, అర్చకులు పాల్గొన్న ఈ యాగంలో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరిగేషన్, సివిల్ సప్లైస్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చతుర్వేద పారాయణం, అగ్ని ప్రతిష్ఠాపన, హోమాలు, ప్రత్యేక ఆహుతులతో యాగ కార్యక్రమాలు కొనసాగాయి.
ప్రాచీన కాలంలో విజయపురిగా ప్రసిద్ధి చెందిన నాగార్జునసాగర్ ప్రాంతానికి వరుణుడి ఆరాధనతో చారిత్రక అనుబంధం ఉందని వేద పండితులు తెలిపారు. తెలంగాణతో పాటు కృష్ణా, గోదావరి నదుల ఎగువ పరీవాహక ప్రాంతాల్లోనూ సమృద్ధిగా వర్షాలు కురవాలని యాగంలో సంకల్పించారు. రిజర్వాయర్లు, చెరువులు నిండాలని, భూగర్భ జలాలు పెరగాలని, ఖరీఫ్ పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సమృద్ధి కలగాలని ప్రార్థనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ యాగం రోజంతా కొనసాగనుండగా, మధ్యాహ్నం 3:20 గంటలకు మహా పూర్ణాహుతి నిర్వహించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!