

సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సనత్నగర్లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. 22.6 ఎకరాల విస్తీర్ణంలో 11.70 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేశారు. నాలుగు బ్లాకులుగా నిర్మించిన ఈ వైద్య సముదాయానికి 75 శాతం నీటి పొదుపుతో ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ లభించింది. ఆరు కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దిన ఈ ఆస్పత్రిలో ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
టిమ్స్ సనత్నగర్ను ఒకే మాస్టర్ప్లాన్తో పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సముదాయంగా నిర్మించారు. మొత్తం 1,082 పడకలు ఉండగా, వాటిలో 300 ఐసీయూ పడకలు ఉన్నాయి. అత్యవసర, క్లిష్ట వైద్య సేవలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ మొత్తం పడకల్లో దాదాపు 30 శాతం ఐసీయూలకు కేటాయించారు. ప్రభుత్వ రంగంలో తొలిసారిగా ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా రోగుల నుంచి సేకరించిన పరీక్షా నమూనాలు ఒకటి నుంచి రెండు నిమిషాల్లో సంబంధిత ల్యాబ్లకు చేరనున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!