

ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు నష్టపోకుండా ముందస్తు కార్యాచరణతో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలతో మూడు దశల అత్యవసర ప్రణాళికను రూపొందించగా, తొలి దశ బుధవారం ప్రారంభమవుతుందని చెప్పారు. ఇక్రిశాట్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి ఈ ప్రణాళిక అమలుపై సమీక్షించారు. రైతులకు శాస్త్రీయ సూచనలు అందించి అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.
వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉండటంతో పాటు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా లేవని మంత్రి తెలిపారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో తక్కువ నీటి అవసరమయ్యే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. తగినంత తేమ ఉన్న తర్వాతే విత్తనాలు వేయాలని రైతులకు సూచించారు. మూడు దశలకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతి వారం మండలాల వారీగా నీటి లభ్యత, పంటల పరిస్థితులపై బులెటిన్లు విడుదల చేస్తామని వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!