

పవిత్రమైన గురు పూర్ణిమ సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పొలాలు పాడిపంటలతో కళకళలాడాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గురు పూర్ణిమ రోజున గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందన్నారు. మహంకాళి బోనాలు, లాల్దర్వాజా, వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న వంటి ఆలయాలు ప్రజలకు ధైర్యం, భరోసా కలిగించే ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు విస్తరించాలని కోరుకున్నారు. తనకు వ్యక్తిగత కోరికలు ఏవీ లేవని, ప్రజల సంక్షేమం, లోకకళ్యాణమే తన సంకల్పమని మంత్రి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!