

వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC)కు చెందిన ఓ నౌకపై క్షిపణి దాడి జరిగినట్లు ఆ సంస్థ ధ్రువీకరించింది. జలసంధి గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపింది. దాడి అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామని, ఎవరూ గాయపడలేదని పేర్కొంది. అంతకుముందు ఇరాన్ మీడియా దక్షిణ హర్మూజ్ ప్రాంతంలో ఓ చమురు ట్యాంకర్గా భావిస్తున్న నౌకలో మంటలు చెలరేగినట్లు వెల్లడించింది. అయితే మంటలకు కారణం, నౌకకు జరిగిన నష్టం వంటి పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఇదిలా ఉండగా, ప్రాంతీయ ఉద్రిక్తతలు సౌదీ అరేబియాకూ విస్తరించాయి. ఇరాన్ మద్దతున్న యెమెన్ హూతీలు సౌదీ అరేబియాలోని ఆరామ్కోకు చెందిన జాజన్ రిఫైనరీపై డ్రోన్ దాడి చేసినట్లు ప్రకటించారు. ఈ ఘటనలో రిఫైనరీలో మంటలు చెలరేగినట్లు సౌదీ ఇంధన శాఖ ధ్రువీకరించింది. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. హర్మూజ్లో నౌకా రవాణా భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఈ వరుస ఘటనలు చోటుచేసుకోవడం గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితుల తీవ్రతను చాటుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!