

ఎర్రకోట పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్ఫలా యూనివర్సిటీకి చెందిన ముగ్గురు వైద్యులతో కూడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘వైట్ కోట్’ ఉగ్రవాద మాడ్యూల్ తొలుత యూనివర్సిటీ ప్రాంగణంలో పేలుడు పదార్థాలను పరీక్షించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. అనంతరం ఫరీదాబాద్ పరిసరాల్లోని నిర్మానుష్య ప్రాంతాలు, చివరకు అరవల్లి అటవీ ప్రాంతంలో ప్రయోగాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
డాక్టర్ ఉమర్ ఉన్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనాయ్, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ పేలుడు మిశ్రమాలు, ఆయుధాలను పరీక్షించినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. తొలుత ఎరువుల ఆధారిత పేలుడు పదార్థాలతో ప్రయోగాలు ప్రారంభించిన ఈ ముఠా, అనంతరం భారీ స్థాయిలో ఐఈడీలను తయారు చేసే స్థాయికి చేరినట్లు ఛార్జ్షీట్లో పేర్కొంది. గత ఏడాది నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మృతి చెందగా, 29 మంది గాయపడిన ఘటనతో ఈ మాడ్యూల్కు సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది.
ఎన్ఐఏ ప్రకారం, ఉమర్, గనాయ్, విద్యార్థి జసీర్ బిలాల్ వానీ కలిసి గత ఏడాది ఈ నెలలో అల్ఫలా యూనివర్సిటీ క్యాంపస్లోని బోరుబావి సమీపంలో పేలుడు పదార్థాన్ని పరీక్షించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రయోగాలను నిర్మానుష్య పొలాలు, ధౌజ్ అటవీ ప్రాంతానికి తరలించినట్లు పేర్కొంది. డాక్టర్ షాహీన్ షాహిద్ ఉగ్రవాద సంస్థ సభ్యులకు సుమారు రూ.16 లక్షలు అందించినట్లు కూడా ఎన్ఐఏ ఆరోపించింది. ఈ నిధులతో ఆయుధాలు కొనుగోలు చేసినట్లు తెలిపింది. రసాయనాలు, ఇతర సామగ్రిని దాచేందుకు అద్దె ఇళ్లను ఉపయోగించినట్లు వెల్లడించింది. పేలుడుకు ఒక రోజు ముందు నవంబర్ 9న ఫతేపూర్ తగా వద్ద సుమారు 2,600 కిలోల అమ్మోనియం నైట్రేట్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!