

సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ హయాంలో ఈ ఆసుపత్రికి రూపకల్పన జరిగిందని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలుదిశలా టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సనత్నగర్ టిమ్స్లో 1,000 పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, అవయవ మార్పిడి విభాగంతో పాటు ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఎక్స్రే, క్యాథ్ ల్యాబ్స్, రేడియాలజీ, డయాలసిస్ వంటి అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
సనత్నగర్ టిమ్స్ హైదరాబాద్ వాసులతో పాటు జిల్లాల నుంచి అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 350 బస్తీ దవాఖానాలతో పాటు 4,000 పడకల కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ సౌకర్యంతో 1,200 ఎమర్జెన్సీ బెడ్లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అయితే రాజకీయ కారణాలతో టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభంలో జాప్యం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన కేటీఆర్.. అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అతిపెద్దదిగా నిర్మిస్తున్న 2,000 పడకల వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు హైదరాబాద్లోని నిమ్స్ విస్తరణ పనులను కూడా వేగవంతం చేయాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!