

సింగపూర్లో ఐటీ ఉద్యోగాలు, నెలకు రూ.1.25 లక్షల వేతనం అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రకటనలను నమ్మిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన దాదాపు వంద మంది యువత సైబర్ ముఠా వలలో చిక్కుకున్నట్లు సమాచారం. బాధితుల్లో గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని రాధారంగానగర్కు చెందిన సాయిబాబా, కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన పూర్ణ వెంకటకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన శ్రీరామ్ ఉన్నారు. విదేశాలకు తీసుకెళ్లిన తర్వాత వారి పాస్పోర్టులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకుని నిర్బంధించినట్లు బాధితులు వెల్లడించారు. వారి నుంచి అందిన సమాచారం ఆధారంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు జులై 17న విదేశాంగ శాఖకు, జులై 22న ఏపీఎన్ఆర్టీకి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిన ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగ ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్న సాయిబాబా, పూర్ణ వెంకటకృష్ణ తదితరులు సింగపూర్లో ఉద్యోగం వచ్చిందనే సమాచారంతో ఏప్రిల్ 2న విజయవాడ నుంచి బయలుదేరారు. అయితే నియామక ప్రతినిధులు వారిని సింగపూర్కు కాకుండా కంబోడియాకు, అనంతరం మయన్మార్కు తరలించినట్లు బాధితులు తెలిపారు. అక్కడ మారుమూల ప్రాంతాల్లో నిర్బంధించి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని, ఆదేశాలు పాటించకపోతే విద్యుత్తు షాక్లు ఇవ్వడం, చీకటి గదుల్లో బంధించడం, ఆహారం ఇవ్వకుండా వేధించడం వంటి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కొందరు యువతులు లైంగిక దాడులకు గురవుతున్నట్లు కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన వారిలో 18 మందిని తిరిగి పట్టుకుని హింసించినట్లు తెలిపారు. తమను విడిచిపెట్టాలంటే ఒక్కొక్కరు రూ.15 లక్షలు చెల్లించాలని ముఠా డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, యువతను సురక్షితంగా భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!