

కరోనా, లాక్డౌన్ కష్టకాలంలో వలస కార్మికులకు అండగా నిలిచి ‘రియల్ హీరో’గా ప్రశంసలు అందుకున్న నటుడు సోనూ సూద్ తాజాగా నేపాల్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. నిత్యావసరాలు, సహాయక సామగ్రితో నేపాల్ రాజధాని కాఠ్మాండూకు వెళ్లిన ఆయన సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పునరావాస కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితిని చూసి తన మనసు ముక్కలైందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. వరదల్లో తల్లిదండ్రులను కోల్పోయిన లేదా వారి ఆచూకీ తెలియక బాధపడుతున్న పిల్లలను చూడటం తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఓ పునరావాస కేంద్రంలో క్రిస్టినా అనే ఎనిమిదేళ్ల చిన్నారిని కలిసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తమ్ముడితో ఉన్న ఆ చిన్నారి తనను చూసి నవ్వుతూ ‘అంతా సర్దుకుంటుంది’ అని చెప్పిందని, ఆమె మాటలు తనను తీవ్రంగా కదిలించాయని తెలిపారు. ఆ చిన్నారిని దత్తత తీసుకోవాలనిపించిందని, అయితే పరిస్థితులు తనను ఏమీ చేయలేని స్థితిలో ఉంచాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు తమకు చేతనైనంతగా నేపాల్ వరద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సోనూ సూద్ పిలుపునిచ్చారు. మనం సురక్షిత ప్రాంతాల్లో ఉన్నందుకు అదృష్టవంతులమని, ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇలాంటి కుటుంబాల కోసం కొంత సమయం కేటాయించాలని కోరారు. విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడం ప్రభుత్వం, మంత్రుల బాధ్యత మాత్రమే కాదని, ఒక మనిషిగా, భారతీయుడిగా మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. “వాళ్లు ఇళ్లను, కుటుంబాలను, అందమైన బాల్యాన్ని కోల్పోయారు. మనమంతా కలిసి వారికి కొత్త జీవితాన్ని అందిద్దాం. నేపాల్.. నువ్వు ఒంటరివి కావు” అని సోనూ సూద్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!