

తమిళనాడులో సీఎం విజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ అన్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, విజయ్ తనకు చాలా కాలంగా స్నేహితుడని, అయితే ఇప్పుడు గౌరవపూర్వకంగా ‘సీఎం విజయ్’ అని పిలుస్తానని తెలిపారు. రాజకీయాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని, మంచి చేసినా విమర్శలు, తప్పు చేసినా విమర్శలు తప్పవని వ్యాఖ్యానించారు.
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని మాధవన్ స్పష్టం చేశారు. ప్రజాసేవ చేయాలనే బలమైన దృక్పథం ఉన్నవారే రాజకీయాల్లోకి రావాలని, తాను మాత్రం తన వృత్తి ద్వారా సమాజానికి ఉపయోగపడాలని భావిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులను గౌరవించడం తన బాధ్యతగా భావిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రముఖ పారిశ్రామికవేత్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘జి.డి.ఎన్’ చిత్రంతో మాధవన్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!