

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అర్హులైన విద్యార్థులు ప్రత్యేకంగా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అడగాల్సిన అవసరం లేకుండా, ప్రతి ఏటా నిధులను ముందుగానే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఈ విధానాన్ని ప్రక్షాళన చేసి ఏటా రూ.2,400 కోట్లను విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తూ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
నెక్లెస్ రోడ్ సమీపంలోని హెచ్ఎండీఏ మైదానంలో జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో సీఎం ఈ విషయాలను వెల్లడించారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల సర్టిఫికెట్లను విద్యాసంస్థలు నిలిపివేయరాదని స్పష్టం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్, నర్సింగ్, పాలిటెక్నిక్, ఏఐ వంటి రంగాల్లో నైపుణ్యాలు సాధించాలని అన్నారు. అలాగే క్రీడల్లో ప్రతిభ చూపే వారికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. పూలే దంపతుల స్ఫూర్తితో విద్యలో రాణించడంతో పాటు సామాజిక చైతన్యం, సమాజ అభివృద్ధికి విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!