

రష్యా నుంచి చమురు, సహజవాయువు వంటి ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కల్పించే ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులోని నిబంధనలు అమల్లోకి వస్తే రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాల ఎగుమతులపై భారీ సుంకాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బిల్లు ట్రంప్ సంతకం కోసం వెళ్లింది.
ఈ పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అమెరికా చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందిన విషయాన్ని నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. 140 కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రత కల్పించడమే భారత్ ప్రధాన లక్ష్యమని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వివిధ వనరుల నుంచి ఇంధన దిగుమతులను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. రష్యా చమురు వాణిజ్యంపై ఇప్పటికే అమెరికా అధికారులతో చర్చించినట్లు పేర్కొంది. ఈ బిల్లు భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల స్థిరత్వంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అమెరికాకు వివరించినట్లు తెలిపింది. దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!