

బద్రీనాథ్ ఆలయానికి వచ్చిన విరాళాల నిర్వహణలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆలయ విరాళాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంతో పాటు ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన సంస్కరణలను బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ (బీకేటీసీ)కి సూచించాలని కమిటీకి బాధ్యతలు అప్పగించారు. బీకేటీసీ బద్రీనాథ్ ఆలయంతో పాటు రాష్ట్రంలోని మరో 44 ఆలయాలు, పాఠశాలలు, ధర్మశాలలను నిర్వహిస్తోంది.
ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ విరాళాల దుర్వినియోగానికి బాధ్యులెవరో గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన విరాళాల రికార్డులు, నగదు నిర్వహణ విధానాలు, విరాళాల సేకరణ, లెక్కింపు ప్రక్రియలు, ఇతర సంబంధిత పత్రాలను కూడా సమీక్షిస్తున్నారు. ఇదే సమయంలో బీకేటీసీ అంతర్గత విచారణను ప్రారంభించింది. ప్రాథమిక ఆధారాల ప్రకారం అవకతవకల్లో ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ప్రమోద్ నౌట్యాల్ అనే ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు బీకేటీసీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!