

ప్రయాగ్రాజ్ కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్గా మారిన మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచారు. కేరళలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన ఆమె, తన ప్రాణానికి ముప్పు ఉందని ఫిర్యాదు చేశారు. తన తండ్రి తన పాస్పోర్ట్, డబ్బు తీసుకున్నారని ఆరోపిస్తూ భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లిన మోనాలిసా తన భద్రత కోసం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఫర్మాన్ ఖాన్తో ఆమె వివాహం నేపథ్యంలో ఇప్పటికే వివాదం కొనసాగుతోంది. మోనాలిసా మైనర్ అని ఆరోపిస్తూ ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మధ్యప్రదేశ్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే తాను మేజర్నని, తన ఇష్టప్రకారమే ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకున్నానని మోనాలిసా చెబుతోంది. గతంలో కేరళ హైకోర్టు ఆదేశాలతో ఆమెకు పోలీసు రక్షణ కల్పించినప్పటికీ, అనంతరం సంప్రదింపులు లేకపోవడంతో భద్రతను ఉపసంహరించారు. తాజాగా ఆమె మళ్లీ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తదుపరి చర్యలపై కొచ్చి నగర పోలీస్ కమిషనర్తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!