

బోడుప్పల్లోని సర్వే నంబర్ 215, 215 పార్ట్లలోని ఇళ్లను అర్బన్ ల్యాండ్ సీలింగ్ నిబంధనల కింద 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎలాంటి వివాదాలు లేకుండా దాదాపు 30 ఏళ్లుగా సుమారు 1,500 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఇళ్లను విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లినప్పుడు తమ ఆస్తులు ప్రొహిబిషన్లో ఉన్నట్లు తెలియడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్ రావు అన్నారు. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి ప్రజలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బాధిత కాలనీలను తక్షణమే 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే బాధితుల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!