

ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామాలయానికి తొలి సీఈవో ఎవరనేది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు బుధవారం ప్రకటించనుంది. ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్దాస్ నివాసంలో మధ్యాహ్నం నుంచి జరిగే సమావేశంలో సీఈవో ఎంపిక కమిటీ తుది జాబితాను సమర్పించనుంది. ముగ్గురి పేర్లతో కూడిన ఆ జాబితా నుంచి ఒకరిని ట్రస్టు ఎంపిక చేయనుంది. ట్రస్టు ప్రధాన కార్యదర్శితోపాటు మరో ఇద్దరు సభ్యుల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. సీఈవో ఎంపిక కమిటీ సభ్యులైన రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కొహ్లీ, రిటైర్డ్ ఎల్జీ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణ సభ్యుడు సురేశ్ హావ్డే ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. సీఈవో పోస్టుకు వచ్చిన 5,585 దరఖాస్తులను పరిశీలించిన కమిటీ.. తుది దశలో 16 మందిని ఇంటర్వ్యూ చేసినట్లు జస్టిస్ ప్రమోద్ కొహ్లీ తెలిపారు.
రామాలయంలో కానుకలు, విరాళాల చోరీకి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో తలెత్తిన వివాదం తర్వాత ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, ట్రస్టీ అనిల్మిశ్ర తమ పదవులకు రాజీనామా చేశారు. ట్రస్టు సభ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్ర మరణంతో మరో ఖాళీ ఏర్పడింది. దీంతో మూడు కీలక పదవుల భర్తీపై ఆసక్తి నెలకొంది. మహారాష్ట్రలోని పుణెకు చెందిన జగదీశ్ ఆఫ్లే రామాలయ నిర్మాణ సమయంలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశారు. ఐఐటీ బాంబే నుంచి ఎంటెక్ చేసిన ఆయనను ట్రస్టు తొలి కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీహెచ్పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాగ్డాకు కూడా ట్రస్టులో చోటు లభించే అవకాశం ఉందని సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!