

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న 'ఓజీ 2'పై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. తొలి భాగానికి వచ్చిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని సీక్వెల్ను మరింత భారీ స్థాయిలో రూపొందించేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం. కథలో మరిన్ని యాక్షన్ ఎపిసోడ్లు, ఆసక్తికరమైన మలుపులు జోడిస్తూ స్క్రిప్ట్ను పూర్తిగా లాక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయ, వ్యక్తిగత కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో 'ఓజీ 2' చిత్రీకరణ వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. అప్పటివరకు దర్శకుడు సుజీత్, హీరో నానితో తెరకెక్కిస్తున్న 'బ్లడీ రోమియో' చిత్రాన్ని పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే సురేందర్ రెడ్డి-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ప్రకటించిన మరో ప్రాజెక్ట్ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలోనే ఉండగా, పవన్ సూచనల మేరకు కథలో మార్పులు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా 'ఓజీ 2' నుంచి ప్రత్యేక అప్డేట్ వచ్చే అవకాశముందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!