

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడంలో సినిమా విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఈ కథను దర్శకుడు తొలుత రవితేజతో పాటు పలువురు తెలుగు హీరోలకు చెప్పగా వారు తిరస్కరించారనే ప్రచారం జరిగింది. దీనిపై వెంకీ అట్లూరి స్పందిస్తూ.. తాను పూర్తి కథను ఏ తెలుగు హీరోకూ చెప్పలేదని స్పష్టం చేశారు. 2020–2022 మధ్య సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల కారణంగా తాను సంప్రదించిన హీరోలు అప్పటికే అంగీకరించిన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత ధనుష్, దుల్కర్ సల్మాన్లను సంప్రదించి, చివరకు సూర్యకు కథ చెప్పగా ఆయన అంగీకరించారని వివరించారు.
క్లైమాక్స్ విషయంలో సూర్య కొన్ని సూచనలు చేశారని వెంకీ అట్లూరి తెలిపారు. హీరో, హీరోయిన్ పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉండేలా క్లైమాక్స్ను రూపొందించాలని సూర్య సూచించినట్లు చెప్పారు. తాను ఊహించినట్లుగానే సినిమా ప్రేక్షకులకు నచ్చడం ఆనందంగా ఉందన్నారు. మరోవైపు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, ఇప్పటివరకు సుమారు రూ.121 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడో స్థానానికి చేరిన ఈ సినిమా ‘కరుప్పు’, ‘జన నాయగన్’ వసూళ్లను అధిగమిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!