

ప్రతిరోజూ మనం వినియోగించే ఆహారం ఎంత సురక్షితమనే ప్రశ్నను ప్రధానాంశంగా తీసుకుని రూపొందుతున్న చిత్రం ది ఇండియా స్టోరీ. ఆహార కల్తీ వల్ల ప్రజారోగ్యంపై పడుతున్న ప్రభావాన్ని కోర్టు డ్రామా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. జీ స్టూడియోస్, ఎంఐజి ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో ఆమె ధైర్యవంతమైన న్యాయవాదిగా కనిపించగా, శ్రేయాస్ తల్పడే విషాదంలో మునిగిపోయిన తండ్రి పాత్రలో కనిపించడం కథపై ఆసక్తిని పెంచుతోంది.
బాంబే హైకోర్టు నేపథ్యంతో రూపొందించిన పోస్టర్ ఈ చిత్రంలోని సామాజిక సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఆహార కల్తీ, నాసిరకం పదార్థాల వినియోగం వల్ల కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులను న్యాయపరమైన కోణంలో చూపించే ప్రయత్నం ఈ సినిమాలో ఉండబోతోంది. చెట్టన్ డి.కె. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాగర్ బి. షిండే కథ అందించడంతో పాటు నిర్మిస్తున్నారు. ది ఇండియా స్టోరీ జూలై 24, 2026న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!