

రోజుకు రూ.45 మాత్రమే సంపాదిస్తూ 12 గంటల పాటు శ్రమించిన బాల కార్మికుడి స్థాయి నుంచి అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగిన దర్శకుడు సంతోష్ డావఖర్ ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మహారాష్ట్ర సంప్రదాయ గోంధాల్ జానపద కళ, ఆచారాల నేపథ్యంలో తెరకెక్కిన ఆయన మరాఠీ చిత్రం ‘గోంధాల్’కు పుణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు లభించింది. అంతకుముందు 2025లో గోవాలో జరిగిన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలోనూ డావఖర్కు ‘సిల్వర్ పీకాక్’ బెస్ట్ డైరెక్టర్ అవార్డు దక్కింది.
తాజాగా ‘గోంధాల్’ 99వ అకాడమీ అవార్డ్స్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి భారత అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 33 చిత్రాల నుంచి ‘గోంధల్’ను ఎంపిక చేసింది. గ్రామీణ మహారాష్ట్ర నేపథ్యంలో సంప్రదాయ గోంధల్ ఆచారం చుట్టూ సాగే కథను డావఖర్ తెరకెక్కించారు. బాల్యంలో కష్టాలను ఎదుర్కొని, స్వయంకృషితో చిత్ర నిర్మాణంలో ఎదిగిన డావఖర్కు ఈ ఎంపిక పెద్ద మైలురాయిగా నిలిచింది. ప్రాంతీయ సంస్కృతి, జానపద సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే అవకాశంగా ఈ గుర్తింపును ఆయన అభివర్ణించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!