

బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే ‘షేకర్ టునైట్’ యూట్యూబ్ టాక్ షోలో ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా సమయంలో తాను ఎదుర్కొన్న తీవ్ర ఒత్తిడి, బెదిరింపుల గురించి వెల్లడించారు. 2002 గోధ్రా రైలు ఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటించినందుకు ఇప్పటికీ గర్వపడుతున్నానని చెప్పారు. అయితే సినిమా విడుదల సమయంలో తనపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్, బెదిరింపులు జరిగాయని తెలిపారు. సైబర్ ట్రోలర్లు తన వాట్సాప్ నంబర్, కారు రిజిస్ట్రేషన్ వివరాలను ఆన్లైన్లో లీక్ చేసి బెదిరించినట్లు వెల్లడించారు.
ఆ సమయంలో తన కుమారుడికి కేవలం ఆరు నెలల వయసు ఉండటంతో కుటుంబ భద్రతపై తీవ్ర ఆందోళనకు గురయ్యానని విక్రాంత్ తెలిపారు. ఈ పరిణామాలు తనను మానసికంగా ఎంతో కుంగదీశాయని చెప్పారు. అయితే కాలక్రమంలో తన ఆలోచనా విధానం మారిందని, ఆన్లైన్లో బెదిరించే వ్యక్తుల అభిప్రాయాల కంటే తన కుటుంబమే తనకు ముఖ్యమని గ్రహించినట్లు పేర్కొన్నారు. ఈ అనుభవాల నేపథ్యంలో 2024 డిసెంబర్లో నటనకు తాత్కాలిక విరామం ప్రకటించిన విక్రాంత్, ఇటీవల ‘ముసాఫిర్ కేఫ్’ సిరీస్తో తిరిగి వచ్చారు. ప్రస్తుతం ‘వైట్’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!