

తెలుగు ఇండిపెండెంట్ మూవీ ‘సంజీవ్’ ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అనిల్ నక్క రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఒక యువ బృందం ఎంతో నమ్మకంతో, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ రూపొందించింది. ఈ చిత్రంలో అనిల్ నక్క, లయ మిర్యాల, వీరమనోహర్ కావలి, హరీష్ పలకుర్తి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఓటీటీ విడుదలకు ముందు హైదరాబాద్లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్లో ‘సంజీవ్’ ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు శైలేష్ కొలను, నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా తమ సినీ ప్రయాణంలోని ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్న శైలేష్ కొలను, రాహుల్ రవీంద్రన్.. సినిమా చేయాలనే కలను నమ్మి ముందుకు సాగే యువ బృందాలకు పట్టుదల, నమ్మకం, టీమ్వర్క్ ఎంతో ముఖ్యమని చెప్పారు. వారి మాటలు ‘సంజీవ్’ టీమ్కు మరింత ప్రోత్సాహాన్ని అందించాయి.
‘సంజీవ్’లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ప్రత్యేకత కేవలం నాలుగు రోజుల్లోనే మొత్తం షూటింగ్ పూర్తి చేయడం. కథ, సన్నివేశాలు, నటీనటుల ప్రిపరేషన్, లొకేషన్లు, సాంకేతిక అంశాలపై ముందుగానే పక్కా ప్రణాళికతో పనిచేయడం వల్లే ఇంత తక్కువ సమయంలో చిత్రీకరణ పూర్తి చేయగలిగామని చిత్ర బృందం తెలిపింది.
పూర్తి స్థాయి సినిమాను కేవలం నాలుగు రోజుల్లో పూర్తి చేయడాన్ని శైలేష్ కొలను, రాహుల్ రవీంద్రన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రస్తుతం ‘సంజీవ్’ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ ఇండిపెండెంట్ మూవీ మరింత విస్తృతమైన ఓటీటీ ప్రేక్షకులకు చేరుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!