

బీజేపీ కార్యాలయాలు, నాయకుల నివాసాలపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు ప్రయత్నించడం పిరికిపంద చర్య అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు తీవ్రంగా విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిర్వహించిన ఆందోళనకు వేలాది మంది విద్యార్థులు, యువత తరలివచ్చి మద్దతు తెలిపారని ఆయన అన్నారు. యువత బీజేపీ వైపు మొగ్గుచూపుతున్న విషయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై నల్లరంగు చల్లడం, పార్టీ నాయకుల నివాసాలను ముట్టడించేందుకు ప్రయత్నించడం, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపై దాడులకు కుట్ర చేయడం వంటి చర్యలు కాంగ్రెస్ అనుబంధ విభాగాలైన ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ తీరుకు నిదర్శనమని విమర్శించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో విధానాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరని, అయితే ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని రామచందర్రావు అన్నారు. బీజేపీ ప్రస్తుతం సంయమనం పాటిస్తోందని, దాడులు కొనసాగితే పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలు ఎన్నుకున్న రాజ్యాంగబద్ధ పదవుల్లో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప అభియాన్’ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండల స్థాయిలో మొక్కలు నాటడం, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు తదితర సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!