

రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకుంటాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి తాను కృషి చేస్తున్నానని తెలిపారు. అవసరమైతే నిజాయితీపరులను అసెంబ్లీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని, ఈ మార్పులో తన పాత్ర కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. డబ్బు కోసం రాజకీయాల్లోకి వచ్చిన వారు శాశ్వతంగా కొనసాగలేరని, డబ్బే లక్ష్యంగా ఉన్నవారు వ్యాపారం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. అధికారులు, రాజకీయ నాయకుల్లో అవినీతి పెరిగితే పేదలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
మంత్రి పదవి తనకు ముఖ్యమేమీ కాదని, రాజకీయ నాయకుల ఆలోచనా విధానంతో పాటు వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రైతులకు ఒకవైపు పథకాల ద్వారా డబ్బులు అందిస్తూ, మరోవైపు బెల్ట్ షాపుల ద్వారా అదే సొమ్మును తిరిగి తీసుకోవడం సరికాదని విమర్శించారు. మునుగోడులో బెల్ట్ షాపులను తొలగించగలిగానని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని ప్రస్తావిస్తూ.. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని, విద్యార్థులపై చేసే ఖర్చును భవిష్యత్తు తరాలపై పెట్టుబడిగా చూడాలని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!