

ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వి. నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం, పంటల ఉత్పాదకత పెంపుపై విస్తృతంగా చర్చించారు.
సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి బోనస్కు అర్హమైన ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని, వాటిని రైతులకు సబ్సిడీపై అందించాలని అధికారులను ఆదేశించారు. రైతు వేదికల ద్వారా విత్తనాల పంపిణీ చేపట్టాలని, సన్న వడ్లు పండించే రైతుల పూర్తి డేటాను సేకరించాలని సూచించారు. అలాగే ధాన్యం దిగుబడులపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని మరింత పెంచాలని సీఎం సూచించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా నియమించి, విత్తనాల పంపిణీ నుంచి ధాన్యం కొనుగోలు వరకు వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ, యూనివర్సిటీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మార్క్ఫెడ్ నష్టాలను తగ్గించడం, ఆయిల్ఫెడ్ను బలోపేతం చేయడం, ఎరువుల కోసం ప్రత్యేక యాప్ ప్రారంభించడం, యూరియా పంపిణీని రైతు వేదికల ద్వారా నిర్వహించడం వంటి అంశాలపై కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!