

ఢిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు దేశ యువత ఆకాంక్షల పట్ల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఉన్న దూరాన్ని బయటపెట్టాయని తెలంగాణ సాగునీటి, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయం కోరుతూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు ప్రభుత్వం చర్చలతో స్పందించకుండా ఘర్షణాత్మక వైఖరిని అవలంబించిందని విమర్శించారు. యువత సమస్యలకు ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పరిష్కారం చూపాలని సూచించారు.
విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలు న్యాయం కోసం చేస్తున్న శాంతియుత పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలిచిందని ఉత్తమ్ పేర్కొన్నారు. నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ స్వయంగా నిలబడటం ధైర్యవంతమైన, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్న నాయకత్వానికి నిదర్శనమని కొనియాడారు. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఆయన అన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య సంస్థల బలోపేతం, సామాన్య ప్రజల సమస్యలపై రాహుల్ గాంధీ తీసుకుంటున్న వైఖరి దేశవ్యాప్తంగా ప్రజల విశ్వాసాన్ని పొందుతోందని ఉత్తమ్ తెలిపారు. 2029 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి రాహుల్ గాంధీ నాయకత్వం వహించి ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలు, సంక్షేమ పాలన, ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!