

మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ రెవెన్యూ గ్రామంలో పేదలకు 19 ఏళ్ల క్రితం ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి, ఇప్పటికీ స్థలాలు కేటాయించకపోవడం అన్యాయమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలాలు కేటాయించాలని కోరుతూ పట్టాదారులు 75 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. 2007లో సర్వే నంబర్ 151లో 290 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారని, ఇప్పటివరకు వారికి స్థలాలు చూపించకపోవడంతో ఇళ్లు నిర్మించుకోలేకపోయారని తెలిపారు.
తమకు కేటాయించిన స్థలాలను చూపించాలని కోరుతూ లబ్ధిదారులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అనంతరం తెలంగాణలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని కవిత పేర్కొన్నారు. ప్రస్తుతం అదే సర్వే నంబర్లో మార్కెట్ యార్డు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పేదలకు కేటాయించిన స్థలంలో మార్కెట్ యార్డు నిర్మించవద్దని, వెంటనే వారికి స్థలాలు చూపించాలని డిమాండ్ చేశారు. 75 రోజులుగా దీక్ష చేస్తున్న పేదలకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!