

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తన ఎన్నికల విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేయనున్న మధ్యంతర పిటిషన్లను ఆగస్టు 25లోగా సమర్పించాలని స్పష్టం చేసింది. చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గంలో విజయ్ ఎన్నికను సవాలు చేస్తూ డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్తో పాటు ఓటర్లు దినేష్, లక్ష్మీ నరసింహన్ పిటిషన్లు దాఖలు చేశారు. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్ కూడా కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు గతంలోనే సీఎం విజయ్ను ఆదేశించింది. తాజాగా జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ ఎదుట విచారణ జరగగా, విజయ్ తరఫు న్యాయవాదులు ఎన్నికల పిటిషన్లను కొట్టివేయాలని కోరుతూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల సమయం కోరారు. అయితే ఆ గడువును నిరాకరించిన న్యాయమూర్తి ఆగస్టు 25లోగా పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేశారు. మంత్రి ఆధవ్ అర్జున ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణను కూడా ఆగస్టు 25కు వాయిదా వేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!