

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 12 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి బోర్డు సమావేశంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోందని, ఇది కొత్త విషయం కాదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఏపీ ప్రాజెక్టులకు పరోక్షంగా సహకరించిందని ఆరోపిస్తూ, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ ప్రయోజనాల పేరుతో విమర్శలు చేయడం రాజకీయ నాటకమని మండిపడ్డారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం–బనకచర్ల, పట్టిసీమ వంటి ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలోనే పురోగతి సాధించలేదా అని ప్రశ్నించిన ఉత్తమ్, ఆగస్టు 18న జరగనున్న GRMB సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు కొత్తవి కావని తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, గూడెం లిఫ్ట్ తదితర ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం GRMB, CWC, జలశక్తి మంత్రిత్వ శాఖ ముందు రాష్ట్ర వాదనను బలంగా వినిపించి సీతారామ, SRLIP ప్రాజెక్టులకు TAC అనుమతులు సాధించిందని, తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో ఎలాంటి ఉదాసీనత లేదని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!