

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను పదవి నుంచి తొలగించడంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. సురేఖను బర్తరఫ్ చేయడం అన్యాయమని, ఓ బీసీ మహిళా మంత్రిపై మాత్రమే చర్యలు తీసుకోవడం దారుణమని విమర్శించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ‘బీఆర్ఎస్ రైతు గర్జన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కొంతమంది మంత్రులపై అవినీతి, కమీషన్ల ఆరోపణలు వచ్చినా చర్యలు లేవని అన్నారు. సురేఖ బీసీ మహిళ కావడం వల్లే ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. మంత్రులందరికీ ఒకే న్యాయం ఉండాలని, సురేఖ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!