

భారత బాక్సర్లకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 2026 ఆసియా గేమ్స్లో పతకాలు సాధించే భారత బాక్సర్లకు 2027 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో వారు పోటీ చేసిన అదే వెయిట్ కేటగిరీలో నేరుగా ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపింది. 2027 వరల్డ్ ఛాంపియన్షిప్ 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్కు తొలి క్వాలిఫయింగ్ ఈవెంట్గా ఉండనుంది. వీలైనంత ఎక్కువ మంది భారత బాక్సర్లను ఈ టోర్నీకి పంపించేందుకు బీఎఫ్ఐ నాలుగు దశల అర్హత విధానాన్ని రూపొందించింది.
ఆసియా గేమ్స్లో పతకం సాధించిన బాక్సర్కు సంబంధిత వెయిట్ కేటగిరీలో ప్రధాన ప్రవేశం లభిస్తుంది. అదే విభాగంలో 10వ ఎలైట్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణ పతకం సాధించిన బాక్సర్ను రిజర్వ్ ఎంట్రీగా పరిగణిస్తారు. ఆసియా గేమ్స్లో ఏదైనా విభాగంలో భారత్కు పతకం రాకపోతే, ఆ విభాగంలోని ఎలైట్ నేషనల్స్ విజేతకు ప్రధాన ప్రవేశం కల్పిస్తారు. ఆసియా గేమ్స్లో నిర్వహించని ఒలింపిక్ వెయిట్ కేటగిరీలకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. వరల్డ్ ఛాంపియన్షిప్లో కోటా బౌట్ దశకు చేరుకుని ఒలింపిక్ కోటా సాధించలేని బాక్సర్లకు ఆసియా క్వాలిఫయర్స్లో నేరుగా పాల్గొనే అవకాశం ఉంటుంది. మిగిలిన స్థానాలను ర్యాంకింగ్స్ ఆధారిత సెలెక్షన్ ట్రయల్స్ ద్వారా భర్తీ చేస్తారు. 2028లో ఇటలీ, హంగరీలో జరగనున్న రెండు వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లకు కూడా ఇదే విధానాన్ని అనుసరించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!