

భారత అథ్లెటిక్స్లో డోపింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిషేధిత పదార్థాలను అందించిన కేసులో అథ్లెటిక్స్ కోచ్ రాకేశ్ కుమార్పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) జీవితకాల నిషేధం విధించింది. గతేడాది మార్చిలోనే ఆయనపై సస్పెన్షన్ విధించగా, అప్పటి నుంచే జీవితకాల నిషేధం అమల్లోకి వచ్చినట్లు నాడా పేర్కొంది. నిషేధిత డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పవర్లిఫ్టర్ గౌరవ్ వాత్స్ను కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
నేషనల్ ఇంటర్-స్టేట్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన స్ప్రింటర్ ప్రకృతి రూపా రావును డోప్ పరీక్షలో నిషేధిత స్టెరాయిడ్లు ఉన్నట్లు తేలడంతో తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఖేలో ఇండియా గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన వెయిట్లిఫ్టర్ చెల్సీకి డోప్ పరీక్షలో విఫలమైనందుకు ఐదేళ్ల నిషేధం విధించారు. నిషేధిత ఆక్సాండ్రోలోన్ వాడినట్లు పరీక్షల్లో తేలడంతో ఓ మైనర్ వెయిట్లిఫ్టర్ను కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. మరోవైపు క్వార్టర్మైలర్ కౌశల్ కుమార్, స్టీపుల్చేజర్ జుఝార్ సింగ్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్ బల్జీత్ కౌర్ తదితరుల పేర్లు కూడా తాజా తాత్కాలిక సస్పెన్షన్ జాబితాలో నమోదయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!