

వార్మప్ మ్యాచ్లో విజయం సాధించిన టీమ్ఇండియా శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది. తొలి రోజు నుంచే శ్రీలంక సవాళ్లకు సమాధానం ఇస్తామని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పినట్లుగానే.. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్లో మెరుగైన ప్రదర్శన చేసింది. వేలి గాయంతో ఇబ్బంది పడిన కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి బ్యాటింగ్కు దిగి సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. ఇక దేవదత్ పడిక్కల్ సెంచరీతో ఆకట్టుకుని వన్డౌన్ స్థానానికి తాను సిద్ధమేనని చాటాడు. దాదాపు పది నెలల తర్వాత టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన రవీంద్ర జడేజా బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్లో నాలుగు వికెట్లు పడగొట్టి కీలకంగా మారాడు.
అయితే తొలి టెస్టుకు ముందు భారత్ కొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. యువ స్పిన్నర్లు మానవ్ సుతార్, సారాంశ్ జైన్ స్పిన్కు అనుకూలమైన పిచ్పై మరింత ప్రభావం చూపాల్సి ఉంది. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. పేస్ విభాగంలో గుర్నూర్ బ్రార్ మెరుగ్గా కనిపించగా.. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అకిబ్ నబీ కూడా వికెట్ లేకుండానే ముగించాడు. మరోవైపు వికెట్ కీపర్ల ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. పంత్ నెమ్మదిగా ఆడేందుకు ప్రయత్నించడం సానుకూల అంశమే అయినా.. భారీ షాట్కు వెళ్లి ఔటవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!