

అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఈ ఏడాది సెప్టెంబరులో ఆవిష్కరించనున్న ఐఫోన్ 18 సిరీస్లో ప్రీమియం మోడళ్లైన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఉత్పత్తిని భారత్లో ప్రారంభించినట్లు సమాచారం. అమెరికా, ఐరోపా మార్కెట్లలో ఈ మోడళ్లకు భారీ డిమాండ్ ఉంటుందని భావిస్తున్న యాపిల్, అంతర్జాతీయ సరఫరా కోసం భారతీయ ప్లాంట్లలో వీటి తయారీని చేపడుతోంది. భారత్లో తయారయ్యే ప్రో సిరీస్ ఫోన్లలో ఎక్కువ భాగం అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి కానుండగా, కొంత భాగం దేశీయ మార్కెట్లో విక్రయించనున్నారు.
ఐఫోన్ల తయారీలో ఫాక్స్కాన్ కీలక పాత్ర పోషిస్తుండగా, టాటా ఎలక్ట్రానిక్స్ కూడా ఉత్పత్తిని విస్తరిస్తోంది. అంతర్జాతీయ సరఫరా కోసం తమిళనాడులోని ఫాక్స్కాన్ ప్లాంట్లో ఐఫోన్ 18 ప్రో మోడళ్ల తయారీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు బేస్ మోడళ్ల తయారీకే పరిమితమైన టాటా ఎలక్ట్రానిక్స్ ఈసారి ప్రో మోడళ్ల ఉత్పత్తిలోనూ భాగస్వామ్యం కానుంది. సెప్టెంబరులో జరిగే యాపిల్ వార్షిక కార్యక్రమంలో ఐఫోన్ 18 సిరీస్తో పాటు సంస్థ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!