

తెలంగాణలో భారీ స్థాయిలో డేటా సెంటర్ పార్కు ఏర్పాటు కానుంది. రూ.60 వేల కోట్ల పెట్టుబడితో, 1,200–1,600 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఫార్చూన్ హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ సంస్థ ముందుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాయిపల్లిలో టీజీఐఐసీకి చెందిన 170 ఎకరాల భూమిని ప్రభుత్వం ఈ సంస్థకు కేటాయించింది. ఫార్చూన్ కంపెనీకి చెందిన సోదర సంస్థ సుదీక్ష ఎస్టేట్స్ ఎల్ఎల్పీ ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది.
ఈ డేటా సెంటర్ పార్కు పూర్తయితే తెలంగాణలోనే కాకుండా దేశంలోనూ అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్లలో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 1,000 మందికి, పరోక్షంగా 3,000 నుంచి 4,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులతో ప్రముఖ డేటా సెంటర్ హబ్గా ఎదుగుతోంది.
ఈ ప్రాజెక్టుతో ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ (AI), ఫిన్టెక్, డిజిటల్ సేవలు, విద్యుత్, ఫైబర్ నెట్వర్క్ రంగాలకు మరింత ఊతం లభించనుంది. 1,200–1,600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ డేటా సెంటర్ పార్కు ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ పార్కుల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ టెక్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!