

భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) భారీగా వస్తున్నప్పటికీ, దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న పెట్టుబడుల కారణంగా నికర ఎఫ్డీఐ గణనీయంగా తగ్గుతోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించిన వివరాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్కు 8,104 కోట్ల డాలర్ల (సుమారు రూ.7 లక్షల కోట్లు) ఎఫ్డీఐ వచ్చినా, విదేశాలకు వెళ్లిన పెట్టుబడులను మినహాయిస్తే నికరంగా 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.8,600 కోట్లు) మాత్రమే మిగిలాయి.
లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. 2023-24తో పోలిస్తే నికర ఎఫ్డీఐ 920 కోట్ల డాలర్లు, 2022-23తో పోలిస్తే 2,700 కోట్ల డాలర్లు తగ్గిందన్నారు. భారత కంపెనీలు విదేశాల్లో వ్యాపార విస్తరణ, వ్యూహాత్మక ఆస్తుల కొనుగోలు, అంతర్జాతీయ మార్కెట్లు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం, అలాగే విదేశీ సంస్థలు భారత్లోని తమ వాటాలను విక్రయించి నిధులను వెనక్కి తీసుకెళ్లడం ఇందుకు ప్రధాన కారణాలని వివరించారు.
అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి కొంత మెరుగుపడింది. ఈ కాలంలో నికర ఎఫ్డీఐ 765 కోట్ల డాలర్లకు (సుమారు రూ.72,860 కోట్లు) చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 665 కోట్ల డాలర్లు ఎక్కువ. ఆర్బీఐ గణాంకాల ప్రకారం మొత్తం ఎఫ్డీఐ 9,453 కోట్ల డాలర్ల (సుమారు రూ.9 లక్షల కోట్లు) రికార్డు స్థాయికి చేరినా, విదేశాలకు వెళ్లిన పెట్టుబడులను మినహాయించిన తర్వాత నికర ఎఫ్డీఐ 765 కోట్ల డాలర్లకే పరిమితమైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!