

యూపీఐ లావాదేవీలపై కొత్తగా అమల్లోకి రానున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ నేపథ్యంలో ఫిన్టెక్ సంస్థ ఫోన్పే తన తొలి పబ్లిక్ ఆఫర్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. రూ.2,000కు పైబడిన నిర్దిష్ట వ్యాపారి యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ అమల్లోకి రానుంది. ఈ ఆదాయాన్ని చెల్లింపుల వ్యవస్థలోని బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు, యూపీఐ యాప్లతో సహా వివిధ భాగస్వాములు పంచుకుంటారు. ఈ కొత్త ఆదాయ వనరు ఫోన్పే ఐపీఓ ప్రణాళికలకు మరింత ఊతమివ్వొచ్చని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు.
అంతర్జాతీయ అనిశ్చితులు, మదుపర్ల సెంటిమెంట్ కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో ఐపీఓ ప్రక్రియను ఫోన్పే వాయిదా వేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమీర్ నిగమ్ వెల్లడించారు. ఫోన్పే దేశంలోని యూపీఐ లావాదేవీల్లో 45 శాతానికి పైగా వాటాను కలిగి ఉందని సంస్థ తెలిపింది. కొత్త ఎండీఆర్ విధానంలో యూపీఐ యాప్లకు కూడా ఆదాయం లభించనుండటంతో, సంస్థ వ్యాపార ఆదాయంపై దాని ప్రభావాన్ని మార్కెట్ వర్గాలు పరిశీలిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!