

రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత వేగవంతం చేయడానికి పోలీసు శాఖ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత తదుపరి తరం డయల్ 112 అత్యవసర సేవల వేదికను ప్రారంభించింది. డీజీపీ సీవీ ఆనంద్ ఈ వ్యవస్థను ప్రారంభిస్తూ, భవిష్యత్తులో డ్రోన్లను 'ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్లు'గా వినియోగించనున్నట్లు తెలిపారు. పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళల భద్రత, విపత్తు నిర్వహణ, విద్యుత్ వంటి అన్ని అత్యవసర సేవలను ఒకే 112 నంబరుతో అనుసంధానించారు.
కొత్త వ్యవస్థలో ఏఐ ఆధారిత కాల్ ఫిల్టరింగ్, ఆటోమేటిక్ కాల్ రూటింగ్, వాయిస్ టు టెక్స్ట్, కచ్చితమైన లొకేషన్ గుర్తింపు వంటి అత్యాధునిక సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రోజుకు వచ్చే సుమారు 14 లక్షల కాల్స్లో స్పామ్, సైలెంట్, అనవసర కాల్స్ను ఏఐ ముందుగానే గుర్తించి తొలగించడం ద్వారా నిజమైన అత్యవసర కాల్స్కు వేగంగా స్పందించే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ 94 శాతం వరకు కాలర్ల లొకేషన్ను ఖచ్చితంగా గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
డయల్ 112 పని తీరును పరిశీలించిన డీజీపీ, బంజారాహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాద సమాచారానికి వెంటనే డ్రోన్ను పంపిన విధానాన్ని పరిశీలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపే డ్రోన్ ద్వారా పరిస్థితులను అంచనా వేసి అవసరమైన సూచనలు అందించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,860 పెట్రోలింగ్ వాహనాలను డిజిటల్గా అనుసంధానించగా, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో డ్రోన్ల వినియోగాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!