

దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే జేఎన్వీఎస్టీ 2027 దరఖాస్తుల గడువును నవోదయ విద్యాలయ సమితి పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం ఆగస్టు 7, 2026 రాత్రి 11:59 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మొదట జూలై 31తో గడువు ముగిసినప్పటికీ, ఇంకా దరఖాస్తు చేయని విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా 665 నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు పరీక్షలో ప్రతిభ ఆధారంగా కల్పిస్తారు.
దరఖాస్తుదారులు సంబంధిత జిల్లాకు చెందినవారై ఉండాలి మరియు 3, 4, 5 తరగతులను గ్రామీణ పాఠశాలల్లో అభ్యసించి ఉండాలి. అభ్యర్థులు మే 1, 2015 నుంచి జూలై 31, 2017 మధ్య జన్మించి ఉండాలి. 2026–27 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. నవంబర్ 28, 2026న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 80 ప్రశ్నలు, 100 మార్కులకు పరీక్ష ఉండగా మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎంపికైన వారికి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి, భోజనం వంటి సౌకర్యాలు అందిస్తారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!