

ప్రజా సమస్యలు, ఆరు గ్యారెంటీల అమలుపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రభుత్వం స్పష్టమైన పరిష్కారం చూపాలని, 2023 డిసెంబర్ 7 తర్వాత నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన భూముల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భూభారతి, 22ఏ నిషేధిత భూముల జాబితా, గత మూడేళ్లలో జరిగినట్లు తాము ఆరోపిస్తున్న అవకతవకలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీశ్ రావు కోరారు. నిషేధిత జాబితా వ్యవహారంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పడం కాకుండా స్పష్టమైన పరిష్కారం చూపాలని అన్నారు. భూభారతిలో రిజిస్ట్రేషన్లు, భూముల బదిలీలు, నాదర్గుల్ భూవ్యవహారం తదితర అంశాలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు గతంలో ఖండిస్తూ 22ఏ జాబితాలోని తప్పులను సరిదిద్దే చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!