

సీనియర్ జర్నలిస్ట్, నెట్వర్క్18కు చెందిన పాయల్ మెహతా ఆకస్మిక మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వం, జాతీయ రాజకీయాలను కవర్ చేసిన పాయల్ మెహతా 46 ఏళ్ల వయసులో ముంబయిలో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. శనివారం రాత్రి ఆమెకు అకస్మాత్తుగా అస్వస్థత కలగడంతో ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. ఆమె మృతిపై పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.
పాయల్ మెహతా నిజాయితీ, అంకితభావంతో పనిచేసే జర్నలిస్ట్ అని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. వార్తల కోసం ఆమె ఎప్పుడూ అదనపు కృషి చేసేవారని, ఆంధ్రప్రదేశ్కు పలుమార్లు వచ్చి క్షేత్రస్థాయిలో రిపోర్టింగ్ చేశారని తెలిపారు. పార్లమెంట్లో కలిసిన ప్రతిసారీ తనను పలకరించి తాజా పరిణామాలను పంచుకునేవారని పేర్కొన్నారు. జర్నలిజం పట్ల ఆమెకున్న ఉత్సాహం, వృత్తి పట్ల నిబద్ధత, అందరినీ ఆప్యాయంగా పలకరించే చిరునవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చంద్రబాబు అన్నారు. పాయల్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, నెట్వర్క్18 సహచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!