

లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇండోర్లో నిర్వహించిన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం రాజకీయ వివాదానికి దారితీసింది. సెప్టెంబర్ 19న జరిగిన ఈ విద్యార్థుల కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి వేదికపై ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ ప్రదర్శన ఇచ్చారు. మోదీ బహిరంగ కార్యక్రమాల్లో చేసే కొన్ని సంభాషణలు, హావభావాలను అనుకరిస్తూ ఆయన చేసిన ప్రదర్శనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో బీజేపీ నేతలు స్పందించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సహా పలువురు బీజేపీ నేతలు ఈ ఘటనపై కాంగ్రెస్, రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు.
అయితే ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం ప్రధానంగా విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం, విద్య, నియామకాలు, ఉద్యోగాలు, పేపర్ లీకేజీలు వంటి అంశాలపై చర్చించడమే లక్ష్యంగా నిర్వహించినట్లు కాంగ్రెస్ తెలిపింది. కార్యక్రమంలో రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇదే వేదికపై జరిగిన మిమిక్రీ ప్రదర్శనపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కార్యక్రమం రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. బీజేపీ నేతలు ప్రదర్శనలో ప్రధాని, ఆయన కుటుంబానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడం అభ్యంతరకరమని విమర్శించగా, ఈ వ్యవహారంపై ఇరు పార్టీల మధ్య రాజకీయ వాగ్వాదం కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!